ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక! "పాపములను ఒప్పుకొనుట" అనే ఈ పుస్తకం ద్వారా మిమ్మును కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని లేఖనములు చెప్పునదేమనగా... "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (1యెహా 1:7) మరియు సామె 28:13 లో "అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును". ఇది ముమ్మాటికీ వాస్తవమే! ఎప్పుడైతే మనలో ఉన్న పాపములను మనం గుర్తించి దేవదేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో ఆ క్షణమందే కృపామయుడైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి, మనలను పవిత్రపరచి, మంచి జీవితం జీవించడానికి సహాయం చేస్తారు. అలాగే 1 యోహాను 2:1,2 ప్రకారం "ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు”.
మనం చేసిన పాపములను ఒప్పుకోవటం అనేది మన దీన స్వభావమును తెలియజేయుటయేగాక, “దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు" అనేదానిని నిశ్చయపరుస్తుంది. ద్వితి 28:15 ప్రకారం మనం చేసే ప్రతి విధమైన పాపము కూడా శాపమును తీసుకొని వస్తుంది కనుక మనం ఏ విధమైన శాపమునుండి విడుదల పొందాలనుకున్నప్పటికీ మొదటిగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకోవాలి. దేవుడు మన పాపములను క్షమించినప్పుడు మాత్రమే మనం నజరేయుడైన యేసుక్రీస్తువారి ప్రశస్త రక్తము ద్వారా మన బంధకాలను తృంచి వేయుటకు అర్హులమౌతాము. నిజానికి మనలోని చాలా పాపాలు లేదా శాపాలు అనేవి దయ్యపు ఆత్మలు మనలోనికి రావడానికి దోహదపడతాయి. కనుక మన పాపాలను మనం ఒప్పుకోకపోయినా లేదా ఆ పాపాలను దేవుడు క్షమించకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనలో ఉన్న దురాత్మలను
మనం ఎదురించలేము సరిగదా అవి ఏమాత్రమూ మన నుండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడవు. మనం మన పాపములను ఒప్పుకున్న తర్వాత మాత్రమే. అపవాది యొక్క బంధకాలను యేసుక్రీస్తు రక్తంలో తెంచివేసి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వాటిని బంధించి, వాటిని బయటకు పారద్రోలగలం.
No comments:
Post a Comment